రాజ‌స్థాన్‌తో రాహుల్‌కు రాచ‌క‌ళ‌…

1819

న్యూఢిల్లీ, ఆగస్టు 21

రాజస్థాన్ రాజకీయ పరిణామాలు కాంగ్రెస్ కు కొంత ఊపిరి పోసినట్లే చెప్పాలి. కాంగ్రెస్ నాయకత్వం పట్ల కూడా నేతల్లో నమ్మకం ఏర్పడింది. .కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించేందుకు ఇష్టపడని రాహుల్ గాంధీ సచిన్ పైలట్ విషయంలో చూపిన చొరవను కూడా పార్టీ నేతలు స్వాగతిస్తున్నారు. సచిన్ పైలట్ కు రాహుల్ గాంధీ ఎలాంటి హామీలు ఇచ్చారన్న విషయం పక్కన పెడితే ఆయన్ను తిరిగి పార్టీలోకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు.
వరసగా చేష్టలుడిగి చూస్తూ కమలం పార్టీకి రాష్ట్రాలను ధారాదత్తం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి రాజస్థాన్ రాజకీయ పరిణామాలు పెద్ద రిలీఫ్ ఇచ్చాయనే చెప్పాలి. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరసగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై కన్నేసింది. అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తులను సృష్టించి అధికారాన్ని చేజిక్కించుకోవడం బీజేపీకి అత్యంత సులువుగా మారింది. ఇందుకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న లోపాలును బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకోగలుగుతుంది.మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్‌లలో కాంగ్రెస్ ను చావుదెబ్బతీసి పవర్ లోకి వచ్చింది.

రాజస్థాన్ రాజకీయాల్లో అనిశ్చితి ఏర్పడినప్పుడు ఈ రాష్ట్రం కూడా కాంగ్రెస్ చేజారి పోతుందని అందరూ భావించారు. కానీ అందరు అంచనాలను తలకిందులు చేసి కాంగ్రెస్ రాజస్థాన్ లో నిలదొక్కుకోవడం పార్టీకి ఎంతో రిలీఫ్ ఇచ్చిందనే చెప్పాలి. అసంతృప్తితో బయటకు వెళ్లిపోయిన సచిన్ పైలట్ ను తిరిగి రప్పించడంలో కాంగ్రెస్ అధిష్టానం సక్సెస్ అయిందనే చెప్పుకోవాలి

.రాజస్థాన్ తర్వాత టార్గెట్ మహారాష్ట్ర అని కమలనాధులు బాహాటంగా చెప్పకపోయినా వారి అడుగులు అవే చెబుతున్నాయి. ఎన్సీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గాలం వేసి మహారాష్ట్రలో చేజారిన అధికారాన్ని తిరిగి సొంతం చేసుకోవాలని బీజేపీ భావించింది. శివసేనతో మళ్లీ కలసి ప్రయాణం చేసేందుకు కూడా బీజేపీ సిద్ధమయింది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను సయితం బీజేపీ దువ్వింది. అయితే రాజస్థాన్ రాజకీయ పరిణామాలతో మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వానికి కొంత బలం చేకూరిందని చెప్పాలి