వ్ర‌తం చెడ్డా ఫ‌లితం ద‌క్కేనా….

1213


పార్టీ మారిన‌ప్పుడు ఉన్న దూకుడు ఇప్పుడు చాలా మంది నాయ‌కుల్లో క‌నిపించ‌డం లేదు. టీడీపీలో సీనియ‌ర్లుగా ఉన్న నాయ‌కులు.. ఆ పార్టీ గుర్తుపై ఎదిగిన నాయ‌కులు.. టీడీపీ చెట్టునీడ‌న రాజ‌కీయాలు నేర్చుకున్న నాయకులు త‌ర్వాత కాలంలో ఆ పార్టీ త‌ర‌ఫున అనేక ప‌ద‌వులు చేప‌ట్టిన నాయ‌కులు ఇటీవ‌ల చాలా మంది వైఎస్సార్ సీపీలో చేరిపోయారు. ఎమ్మెల్యేలు కొంద‌రు ప్రత్యక్షంగా మ‌ద్దతు చెప్పలేక‌.. ప‌రోక్షంగా వైఎస్సార్ సీపీకి మ‌ద్దతు ప‌లికారు. వీరి ప‌రిస్థితి ఒకింత బాగానే ఉంద‌ని అనుకోవాలి. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ చిత్తుగా ఓడిపోయాక ఆ పార్టీకి చెందిన వ‌ల్లభ‌నేని వంశీమోహ‌న్‌, మ‌ద్దాలి గిరిధ‌ర్‌, క‌ర‌ణం బ‌ల‌రాం వైసీపీకి ద‌గ్గర‌య్యారు. ఇక ఎన్నిక‌ల్లో ఓడిన నేత‌ల్లో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల‌తో పాటు ఎమ్మెల్సీలు సైతం జ‌గ‌న్ చెంత‌కు చేరిపోయి సేద తీరుతున్నారు. వీరితో పాటు వీరిని న‌మ్ముకుని ఉన్న చాలా మంది ఇత‌ర నాయ‌కులు కూడా చంద్రబాబుకు జ‌ల్ల కొట్టి.. వైఎస్సార్ సీపీలో చేరిపోయారు.


ఈ లిస్ట్ ఓ సారి చూస్తే తూర్పుగోదావ‌రికి చెందిన తోట త్రిమూర్తులు, అనంత‌కు చెందిన యామినీ బాల‌, శ‌మంత‌క‌మ‌ణి, ప్రకాశం జిల్లాకు చెందిన పోతుల సునీత‌, అన‌కాప‌ల్లిలో ఎంపీగా ఓడిపోయిన గుడివాడ అమ‌ర్నాథ్ వంటి వారు చాలా మంది ఉన్నారు. అయితే, వీరికి ప్రాధాన్యం లేదనే టాక్ వినిపిస్తోంది. ఏదో వ‌చ్చారు.. ఏదో ఉన్నారు అనే ధోర‌ణిలోనే వైఎస్సార్ సీపీ నాయ‌క‌త్వం భావిస్తోంద‌ని చెబుతున్నారు. కానీ ఇలా వ‌చ్చిన వారికి మాత్రం చాలా ఆశ‌లు మాత్రం ఉన్నాయి. టీడీపీలో ద‌క్కని ప‌ద‌వులు ఏవో త‌మ‌కు ఇక్కడ ద‌క్కుతాయ‌ని అనుకున్నారు. కానీ, ఇక్కడ ఆ ప‌రిస్థితి ఎక్కడా క‌నిపించ‌డం లేదు

దీనికి కార‌ణాలు ప్రధానంగా రెండు క‌నిపిస్తున్నాయి. ఒక‌టి ఇప్పటికే వైఎస్సార్ సీపీలో ఉన్న నాయ‌కులు ప‌ద‌వుల కోసం ఎదురు చూస్తున్నారు. వీరంతా పార్టీ కోసం కాడిమోసిన వారే.. త్యాగాలు చేసిన వారే.. ఇప్పుడు వీరిని కాద‌ని కొత్తగా వ‌చ్చిన వారికి ప‌ద‌వులు క‌ట్టబెట్టడం స‌రికాద‌నే భావ‌న వైఎస్సార్ సీపీలో క‌నిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే జ‌గ‌న్ మండ‌లి ర‌ద్దు చేస్తాన‌న్న మాట చెప్పడంతోనే పార్టీ నేత‌ల్లో చాలా మంది ఆశ‌లు ఆవిరిపోయాయి. ఇక ఇప్పుడు నామినేటెడ్ ప‌ద‌వుల కోసం భారీ పోటీ ఉంది. ఇక జ‌గ‌న్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ? ఎవ‌రికి ఏ ప‌ద‌వి ఇస్తారో ? ఆయ‌న చ‌ర్యలు ఊహాతీతం అన్నట్టుగా ఉన్నాయి. ఈ మాట సొంత పార్టీ నేత‌లే అంటున్నారు.జ‌గ‌న్ ఎన్నిక‌ల‌కు ముందు పార్టీలోకి వ‌చ్చిన అవంతి శ్రీనివాస్‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వడం ఎన్నిక‌ల ముందే వ‌చ్చిన పండుల ర‌వీంద్రబాబుకు ఎమ్మెల్సీ ఇవ్వడం పార్టీలోనే చాలా మందికి న‌చ్చడం లేదు. పార్టీ కోసం ఎప్పటి నుంచో ఉన్న వారికే దిక్కూ దివాణం లేదు. ఇక ఎన్నిక‌ల త‌ర్వాత పార్టీ మారిన వారిని జ‌గ‌న్ ఇప్పుడు అంద‌లం ఎక్కిస్తార‌ని ఆశించ‌డం అత్యాశే అవుతుంద‌ని… ఈ జంప్ జిలానీల‌పై సెటైర్లు కూడా పేలుతున్నాయి. ఇక‌, రెండో కార‌ణం..

ఇలా వ‌చ్చిన వారికి సొంత పార్టీలోనే ప్రాధాన్యం ద‌క్కలేదు. పైగా వీరికిజ‌న బ‌లం కూడా పెద్దగా లేదు. ఇలాంటి వారు వ‌స్తామంటే.. ర‌మ్మన్నారు త‌ప్ప.. వారి వ‌ల్ల పార్టీకి పెద్దగా ప్రయోజ‌నం ఉంటుంద‌ని జ‌గ‌న్ భావించ‌డం లేదు.పోతుల సునీత, యామినీ బాల‌, శమంత‌క‌మ‌ణి, గుడివాడ అమ‌ర్నాథ్ వీరిలో పార్టీ మారిన వారికి బిజినెస్‌లు ఉంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా అవి చూసుకోవ‌డం మిన‌హా ప‌ద‌వుల‌పై ఆశ‌లు పెట్టుకుంటే క‌ష్టంగానే క‌నిపిస్తోంది. ఇక వీరి సొంతంగా కేడ‌ర్ కూడా లేక‌పోవ‌డంతో వీరు పార్టీ మారిన రోజు మిన‌హా ఆ త‌ర్వాత ఎన్ని ప్రయ‌త్నాలు చేసినా కూడా జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి రెండోసారి అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేద‌ని వాళ్లే లీకులు ఇస్తోన్న ప‌రిస్థితి