‘ప్రజా గొంతుక ‘ కలేకూరి ప్రసాద్ – తంగిరాల సోని

3162

(అక్టోబర్ 25 – 2020 మహా కవి , రచయిత , అనువాదకులు , వక్త , ఉద్యమ కారులు ‘ కలేకూరి ప్రసాద్ ‘ 58 వ జయంతి
1968లో కంచికచర్ల కోటేశు ఘటన జరిగనప్పుడు నాలుగు సంవత్సరాలు కలేకూరి ప్రసాద్ కు. ఆ ఘటన అలజడి లో నుంచే కలేకూరి ప్రసాద్ ఒక పేను ఉప్పెనలా మారాడు అంటారు స్థానికులు.నిత్యం రగిలే మంట .కారంచేడు , చుండూరు ,పదిరికుప్పం , నీరుకోండ‌‌, గోకరాజు పల్లి ,బత్తినపాడు ,లక్షీంపేట ఘటనకు స్పందిచి అనేక పాటలు , కవితలు రూపొందించి , స్వయంగా ఉద్యమంలో మమేకమైవాడు.కారంచేడు ఒగ్గు కథ కలేకూరి నుంచి జాలువారినదే.

1985 లో ప్రకాశం జిల్లా ‘టంగుటూరు’లో ఇందిర హత్యనుంచి వచ్చిన పాట ‘ కర్మభూమిలో పూసిన ఓ పువ్వా విరిసి విరియని ఓ చిరునవ్వా ‘ పాట అప్పుడు రసిందే . దానిని తర్వాత శ్రీరాములయ్య సినిమాలో ఉపయోగించుకున్నారు. అదే సినిమాలో ‘ భూమికి పచ్చాని రంగేసినట్టో అమ్మలాలో ‘ పాట కూడా. జయం మనదేరా లో చిన్నిచిన్ని ఆశలన్నీ పాట , బహుజన ఉద్యమాలకు అనేక పాటలు రాసి ఉద్యమాలను ఉదృతంచేసారు.’కుమిలిపోయిన నలిగిపోయిన చుండూరు గుండెల గాయం ‘పాట చుండూరు ఉద్యమానికి వెన్ను థనై నిలిచింది.

దళిత మ్యానిఫెస్టో లాంటి కవిత . ‘పిడికెడు ఆత్మగౌరవం ‘కోసం రాసాడు.దళిత సాహిత్యం , దళిత కిరణాలు,దళిత ఉద్యమం – దళిత సాహిత్యోద్యమం ,ఆంధ్రప్రదేశ్ ళితులు లాంటి పుస్తకాలు కలేకూరి ప్రసాద్ రాసారు. అనేక అనువాదాలు చేసారు . మహాశ్వేతాదేవి ‘ రుదాలి’ , ఛోళీకే పీచే,’పాలతల్లి. అరుంధతీ రాయ్ ‘ ఊహలు సైతం అంతమయ్యే వేళ’, స్వామిధర్మతీర్థ ‘ హిందూ సామ్రాజ్య వాద చరిత్ర’. ప్రిము లెవి ‘ ఖైదీ నెం 174517’, బషీర్ కథలు ,కీశోరు శాంతబాయి కాళే ఆత్మకథ ‘ఎదురిత’చేగువేరా రచన , ఏ.జి.నూరాని ‘ ఇస్లాం – జిహాద్’.బోపాల్ డాక్యుమెంట్ ,గెయిల్ అంవతే ‘ మహాత్మా జ్యోతిరావు ఫూలే’లాంటి అనేక పుస్తకాలు అనువాదం చేసారు. పాబ్లో నెరుడా , నామ్ దేవో ధసాల్, డేవిడ్ దియోప్, శరణ్ కుమార్ లింబాలే,దయాపవర్ ,ఎల్.ఎస్.రోకాడే,ఖలీల్ జిబ్రాన్ , గూగివా ధియాంగో జాతీయ ,అంతర్జాతీయ కవులు దాక అందరిని తెలుగు సాహిత్యం లోకానికి కవిత్వం ద్వారా పరిచయం చేసారు . అసలు కన్నా అనువాద మే బాగుంది అనేవారు ఉన్నారు.
అనేక అంతర్జాతీయ అంశాలపై వివిధ పత్రికలలో వ్యాసాలు , రాసారు.ఉద్యమం సంబంధించిన దాదాపు నాలుగు వందల పాటలు రాసాడు అంటారు మిత్రులు. కలేకూరి ప్రసాద్ సాహిత్యం కోసం తన పేర్లుశబరి , సంఘమిత్ర , యువక , కోటేశు ,కవన పేర్లతో రాసాడు.
ఇటూ , కవిత్వం , అనువాదం , పాటలు , గొప్ప వక్త , ఉద్యమాన్ని స్వయంగా నిర్మించడం కలేకూరి ప్రసాద్ లో అనేక కోణాలు ఉన్నాయి.

Photo Courtesy: Telugubooks.in

1994 లో బహుజన సమాజ్ పార్టీ నుంచి నందిగామ నియోజకవర్గ నుంచి ఎమ్మెల్యే గా పోటీ చేసారు.ఆంధ్రభూమి లో సబ్ ఎడిటర్ గా కొంత కాలం చేసారు. కంచికచర్ల ప్రాంతంలో అనేక ఉద్యమంలో క్రీయశీలక పాత్ర వహించాడు.ఏదైనా కలేకూరి ప్రసాద్ జీవితం మొత్తం ఉద్యమం – సాహిత్యం కొరకే జీవించాడు. తెలుగు రాష్ట్రం మొత్తం కలేకూరి అభిమానులు ఉన్నారు. కలేకూరి ప్రసాద్ పాట కర్మభూమిలో పూసిన పాట ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పాఠ్యంశంగా చేర్చారు.ఎవరిని తక్కువగా చులకనగా చూడకపోవడం కలేకూరి ప్రసాద్ వ్యక్తిత్వం . డబ్బులపై మోజు లేనోడు, పూరిగూడిశో , మిద్దెల్లో ఒకేలా బతికాడు ఎప్పుడు జనంలోనే బతికాడు.జనంకోసమే బతికాడు .
నిరంతరం దళిత సమాజం మార్పుకోసం , రాజ్యాధికారం కోసమే రచనలు చేసాడు.ఉవ్వెత్తున ఎగిసిపడే అలల కెరటంలాగా తన మాట దారాళంగా ఉంటుంది.అతను మాట్లాడుతుంటే సభలో అలజడులు పుట్టాల్సిందే.కలేకూరి ప్రసాద్ 50 వ పుట్టినరోజు ఒంగోలు లో ఘనంగా జరిగింది. అప్పటికే కలేకూరి ప్రసాద్ ఆరోగ్యం సరిగ్గా లేదు. జీవితం లో ఎబై సంవత్సరాల బతుకులో దాదాపుగా 35 సంవత్సరాలు ఉద్యమం కోసమే పనిచేసాడు.అనేక అవమానాలు , అనేక అటుపోట్లు , ఎదుర్కొని దళిత ఉద్యమంకోసం నిరంతరం పెనుగులాట లాడిన ఊపిరి 2013 మే 17 న ఆగిపోయింది. తెలుగు ఉద్యమ లోకం , సాహిత్య లోకం మొత్తం కన్నీరై ఆత్మీయ గుర్తులను గుర్తుచేసుకుంటున్నారు .తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో, మరియు యూనివర్సిటీ లో కలేకూరి ప్రసాద్ వర్థంతులు , జయంతులు జరుగుతున్నారు.కవులు మరణించరు ఎప్పుడూ ప్రజల్లో పుడుతునే వుంటారు అనటానికి సాక్ష్యం కలేకూరి ప్రసాద్ జీవితం మాత్రమే.

తంగిరాల సోని -96 766 09 234